Thursday 17 November 2016

చిలుకూరు బాలాజీ దేవాలయం


 " చిలుకూరు బాలాజీ దేవాలయం "

తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఇక్కడి స్వామివారిని  " వీసాల బాలాజీ " అని కూడా పిలుస్తుంటారు.

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు.

చిలుకూరు దేవాలయం హైదరాబాద్‌ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్‌ వెళ్లే మార్గంలో ఉంది.
శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7.45 వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు.
బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే.
ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు.

ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు.
అనంతరం భక్తులకు అనుమతిస్తారు.
భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.

స్థలపురాణం:

సుమారు 500 ఏళ్ల కిత్రం..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా,కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి.. ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా..
వెలికి తీసి గుడి నిర్మించు’.. అని చెప్పి మాయమయ్యాడట.
నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.. గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి.

ఈ దేవాలయంలో 1963లో ‘రాజ్యలక్ష్మి’ అమ్మవారిని ప్రతిష్ఠించారు.
ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా సుందరేశ్వర, హనుమాన్‌
ఆలయాలు , గరుత్మంతులవారి గుడి ఉన్నాయి.
ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
పూలంగి, అన్నకోట, బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.