Friday 30 November 2018

రవ్వ పులిహోర





రవ్వ పులిహోర
కావలసిన పదార్థాలు

1. రవ్వ - ఒక కప్పు,
2. పచ్చిమిరపకాయలు - 5,
3. పల్లీలు - పావు కప్పు,
4. కరివేపాకు - నాలుగు రెమ్మలు,
5. నిమ్మకాయలు - 2,
6. ఎండు మిరపకాయలు - 2,
7. శనగపప్పు - 2 చెంచాలు,
8. మినపప్పు - ఒక చెంచా,
9.ఆవాలు - అర చెంచా,
10. జీలకర్ర - అర చెంచా,
11. పసుపు - పావు చెంచా,
12. ఉప్పు- తగినంత
13 . నూనె - తగినంత

తయారీ విధానం
ఒక గిన్నె లో
రెండు కప్పుల నీళ్ళు మరిగించి
అందులో ఉప్పు, పసుపు వేయాలి.
దీంట్లో రవ్వ పోసి
ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో వేసి
పక్కన పెట్టాలి.
మూకుడు లో నూనె పోసి
ఆవాలు, జీలకర్ర  వేసి ,
వేగాక ,
పల్లీలు వేసి బాగా  వేయించాలి.
ఆ తర్వాత శనగ పప్పు, మినప పప్పు వేసి వేగనివ్వాలి.
దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి.
కాస్త చల్లారాక
వేయించుకున్న రవ్వలో కలపాలి.
ఆ పైన
ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
రవ్వ పులిహోర రెడీ.
బాగా చల్లారిన తరువాత  తింటే బాగుంటుంది

Thursday 29 November 2018

పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు



శ్రీవారి 
తిరుమల శ్రీనివాసునికి ఆశ్వయుజమాసంలో బ్రహ్మోత్సవాలు  జరిగితే

అమ్మవారికి కార్తిక మాసంలో జరుగుతాయి.

అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించిన పంచమినాటికి ముగిసేలా తొమ్మిది రోజుల ముందు ప్రారంభించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తమిళ కార్తికమాసం శుక్లపక్ష పంచమికి ముగిసేట్లుగా ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి డిసెంబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. తిరుమలలో మాదిరిగానే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

* ప్రారంభానికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. ప్రారంభం నాటి ఉదయం తిరుచ్చి వాహనాన్ని అధిరోహించి అమ్మవారు తిరు వీధుల్లో ఊరేగి ఆలయం చేరుకున్నాక ద్వజారోహణం జరుగుతుంది. ఆ నాటి రాత్రి నుంచి వాహన సేవలు జరుగుతాయి.

* బ్రహ్మోత్సవాల్లో తొలినాటి రాత్రి చిన్న శేషవాహనంపై, రెండోరోజు ఉదయం పెద్ద శేషవాహనంపై అమ్మవారు ఊరేగుతారు.

* అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు అత్యంత ముఖ్యమైన గజ వాహన సేవ జరుగుతుంది. లక్ష్మీదేవి ఏనుగు కుంభ స్థలంలో నివసిస్తూ ఉంటుందని చెబుతారు. తాను నిత్యం నివసించే ఏనుగునే వాహనంగా చేసుకుని ఊరేగే అమ్మవారిని దర్శించడం పుణ్యప్రదమని భక్తులు భావిస్తారు.

తిరుమల నుంచి సారె...
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు జరిగే పంచమీ తీర్థంలో చక్రస్నానంనాడు తిరుమల నుంచి అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీ. ఆ రోజు తిరుమల నుంచి అర్చకులు, ఆలయ అధికారులు కాలినడకన సారెను తీసుకువస్తారు. ఇందులో రెండు పట్టు చీరెలు, రెండు పట్టు రవికలు, పచ్చి పసుపు చెట్లు, పసుపు, చందనం ముద్దలు, పూల మాలలు, తులసి మాలలతో పాటు రెండు బంగారు నగలు ఉంటాయి. ఇంకా వివిధ పిండి వంటలు ఒక్కో పడి వంతున పంపుతారు. అంటే 51 పెద్ద లడ్డూలు, 51 వడలు, 51 దోసెలు సారెలో భాగంగా పంపుతారు. వీటిని ఏనుగు అంబారీపై ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు.
తిరుచానూరులో పంచమీ తీర్థం ముగిశాకే తిరుమలలో స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.
అయ్యవారు - వేంకటేశ్వరుడు
అమ్మవారు -  పద్మావతీదేవి

ఆమె వ్యూహలక్ష్మి...
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని తమను రక్షించేందుకు భువికి వచ్చిన శ్రీమన్నారాయణుడిగా భక్తులు కొలుస్తారు. ఆగ్రహంతో విచక్షణ మరిచిన భృగు మహర్షిని అనుగ్రహించిన భర్తపై కోపంతో వైకుంఠం వదిలి భూమికి చేరిన శ్రీమహాలక్ష్మినే పద్మావతీదేవిగా భావిస్తారు.

 శ్రీనివాసుడు ఏడుకొండలను నివాసంగా చేసుకోగా, మహాలక్ష్మి ఆయన హృదయంపై కొలువుదీరింది.

వ్యూహలక్ష్మి పేరుతో పూజలు, ఆరాధనలు అందుకునే అమ్మ భక్తులను అనుగ్రహించమని స్వామిని ప్రోత్సహిస్తూ ఉంటుందని చెబుతారని భక్తుల నమ్మకం.

శ్రీ వేంకటేశ్వరుని హృదయ పీఠంపై పద్మాసన స్థితిలో వ్యూహలక్ష్మి ఉంటారు. ఈమెను దర్శించడం, ఆరాధించడం అందరికీ సాధ్యపడదు. అందుకే అందరికీ దర్శనమివ్వాలనే తలంపుతోనే అమ్మవారు సువర్ణముఖీ తీరంలో స్వతంత్ర వీరలక్ష్మిగా కొలువుదీరారని అంటారు. అంటే శ్రీనివాసుని హృదయ పీఠంపై ఉన్న దేవేరే తిరుచానూరులో ఉన్న పద్మావతీ దేవి.
ఆ సరోవరంలో...
లక్ష్మీదేవి అలిగి భూలోకం చేరాక ఆమెను వెదుకుతూ స్వామి కూడా వచ్చేశారు. ఆయన ప్రస్తుత తిరుచానూరులో పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేసుకుని పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు. కార్తిక మాసంలో పంచమి శుక్రవారం నాడు సరోవరంలోని బంగారు పద్మంలో అమ్మ ప్రత్యక్షమయ్యారు. అలా పద్మంలో నుంచి వచ్చారుకాబట్టి ఆమె పద్మావతి అయిందని అంటారు.

మరో కథ ప్రకారం సంతానం కోసం యజ్ఞం చేసిన నారాయణవనాన్ని పరిపాలించే ఆకాశరాజు యజ్ఞ భూమిని దున్నుతున్న సమయంలో ఓ పెట్టె దొరికింది. అందులో వెయ్యి రేకులున్న తామర పుష్పంలో స్త్రీ శిశువు దర్శనమిచ్చింది. ఆమెను బిడ్డగా స్వీకరించిన ఆకాశరాజు పద్మంలో లభించినందువల్ల పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుని యుక్త వయసు రాగానే శ్రీనివాసునికిచ్చి వివాహం జరిపించారని అంటారు.

అలమేలు మంగ అమ్మవారు
పద్మావతీ అమ్మవారిని అలమేలు మంగాదేవి అనికూడా పిలుస్తారు.

పూర్వం శుక మహర్షి హిమాలయాల నుంచి బయల్దేరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వర్ణముఖీనదీ తీరంలోని ప్రస్తుత క్షేత్రానికి చేరి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నివసించసాగారు. తర్వాత అక్కడ ఒక ఊరు ఏర్పడింది. దీన్ని మహర్షి పేరుమీదే శ్రీ శుకనూరు అని పిలిచేవారు. తర్వాత అది తిరుగచ్చనూరు అయింది. అది కాల క్రమంలో తిరుచానూరు అయింది. తిరుచానూరులో అమ్మవారు పద్మంపై ఆశీనురాలై ఉంది. తమిళంలో అమ్మవారిని అలర్‌మేల్‌ మంగై అని అంటారు. అంటే తామర పువ్వుపై ఉన్న దేవత అని అర్థం. అందువల్లనే పద్మావతీదేవికి అలమేలు మంగా దేవి అని, తిరుచానూరుకు అలమేలు మంగాపురం అని పేర్లు వచ్చాయి.

తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించిన తర్వాత స్వామి చెంతకు వెళ్లాలని నియమం.

పంచమీ తీర్థం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైంది పంచమీ తీర్థం. ఇది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరుగుతుంది. అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరంలో ఆమె ఆవిర్భవించిన రోజు జరిగే సేవ ఇది. పద్మ సరోవరం వద్ద అమ్మవారికి స్నపన తిరుమంజనం జరుగుతుంది. తర్వాత చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంలో లక్షలాది మంది భక్తులు పంచమీ తీర్థంలో స్నానం చేస్తారు. ఆనాటి రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఇద్దరు దేవేరులు. శ్రీదేవి, భూదేవి. శ్రీవారి మూలవిరాట్టుపై శ్రీదేవి శాశ్వత స్థానాన్ని పొందగా, భూదేవి రూపాన్ని స్వామి వక్ష స్థలంపై అలంకరిస్తారు. వ్యూహలక్ష్మి తిరుచానూరులో కొలువుదీరి ఉన్న పద్మావతీదేవి కాగా, భూదేవి ఎక్కడ కొలువుదీరారనే సందేహం కలుగుతుంది. ఈ విషయాన్ని వరాహ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యం వివరిస్తుంది. స్వామి వారి ఆనంద నిలయాన్ని నిర్మించింది తొండమాన్‌ చక్రవర్తి. ఆయన ఒకసారి నేరుగా శ్రీవారి ఏకాంత మందిరంలోకి వచ్చినప్పుడు, హఠాత్తుగా ప్రవేశించిన ఆయనను చూసి శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దాక్కుంటే, భూదేవి ఆలయంలోని బావిలో దాక్కు,న్నారు. ఆ బావే ఇప్పటి సంపంగి ప్రదక్షిణంలో ఉన్న పూలబావి అని చెబుతారు. తర్వాత రామానుజులు తిరుమల సందర్శించినప్పుడు ఈ గాథ తెలుసుకుని ఆ బావిలోనే అమ్మను ప్రతిష్ఠించి నివేదనలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. స్వామి వారి పూలమాలలను కూడా ఆ బావిలోనే వేసే ఏర్పాట్లు చేసినట్లు చెబుతారు..

రామానుజాచార్యుల కాలం నుంచి కొండపై ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

Friday 23 November 2018

తెలుగు సామెతలు.

 తెలుగు సామెతలు.

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా