Thursday 15 December 2016

" శ్రీ కనక మహాలక్ష్మి" అమ్మవారు , విశాఖపట్నం


" శ్రీ కనక మహాలక్ష్మి"   అమ్మవారు , విశాఖపట్నం

బురుజుపేటలో వెలసిన " శ్రీ కనక మహాలక్ష్మి"  అమ్మవారిని భక్తులు
ఆరోగ్యాన్ని,  స్త్రీ లకు సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా ,
భక్తులు విశ్వసిస్తారు.

పూజలు చేసుకోడానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే అమ్మవారికి
పసుపు ,కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి
దేవికి నివేదించే సంప్రదాయం ఉంది.
ఇదీ ఈ అమ్మవారి ప్రత్యేకత.

అమ్మవారి సేవలకు " గురువారం " ప్రీతికరమైన రోజు.
ఆ రోజు తెల్లవారినది మొదలు రాత్రి వరకు అమ్మవారిని సందర్శించి ,
తీర్థ, ప్రసాదాలను స్వీకరిస్తుంటారు.

శ్రీకనక మహాలక్ష్మి విగ్రహం ఇతర దేవాలయాలవలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో ఉంది. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజులపాలనలో ఉండేదని,
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పుగా పేర్కొంటారు. విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అంచేతనే ఈ ప్రదేశాన్ని బురుజుపేట అనే పేరుతో పిలుస్తారు.

ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆరాధిస్తారు.

ప్రతి ఏటా మార్గశిర మాసం నెలరోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు.

ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా, ఇరుగు, పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తుంటారు.

ఈ నెల రోజులు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా కనిపిస్తుంది. రథోత్సవం, వేదపండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

చివరి గురువారం అన్న ప్రసాద వితరణను జరుపుతారు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/