Wednesday 3 February 2016

మహామృత్యుంజయ మంత్రం


ప్రమాదాల నుంచి రక్షించే
మహామృత్యుంజయ మంత్రం.

మకార మననం ప్రాహుస్త్ర కారస్త్రాణ ఉచ్యతే
మనన త్రాణ సమ్యుక్తో మంత్ర ఇత్యభిధీయతీ

మ కారం అంటే మననం చేయడం. అంటే పదేపదే ఉచ్ఛరించడం. ‘ త్ర ‘ కరం అంటే త్రాణము. అంటే రక్షించేది. కాబటి మంత్రమంటే పదే పదే ఏకాగ్రతతో ఉచ్ఛరించేవారిని రక్షించేదని అర్థం. సాధనకు, కార్యసిద్ధికి ప్రత్యేకమైన ఫలితాలకు సిద్ధిత్వాని కలిగించేదే మంత్రం.
దైవాధీనం జగత్సర్వం
మంత్రాధీనంతు దైవతం
జగత్తంతా దైవానికి ఆధీనమై ఉంటుంది. అట్టి దైవం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. ఈ సూక్తిననుసరించి మంత్రోపాసనకు దైవం వశమవుతోందని తెలుస్తోంది. శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్ఛారణ వలన, మంత్రాల లోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి అద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. అది మన ఊహకందనిది.
ఉదాహరణకు, ‘ఓం నమ: శివాయ ‘ అనే మంత్రం సకల శుభాలను కలిగిస్తుందని పెద్దల వాక్కు.
కితస్య బహుభిర్మం త్రై:
కింతిర్థై: కిం తపోధ్వరై:
యస్య నమశ్శివాయేతి
మంత్రో హృదయ గోచర: అని అన్నారు. అంటే, ఎవరి హృదయంలో నిరతరం “ఓం నమ: శివాయ” అనే మంత్రం జపించబడుతుంటుంతో, వారికి ఇతర మంత్రాలతో, తీర్థయాత్రలతో, యజ్ఞయాగాదులతో పని లేదని భావం. ఓం నమశ్శివయ (షడక్షరీ) నమశ్శివాయ (పంచాక్షరీ) మంత్రాలలో ఏ ఒక్క మంత్రాన్ని అయినా శ్రద్ధతో జపించే వ్యక్తి సమస్త శుభాలను పొందగలుగుతాడు.
అలాగే మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు.
ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు ప్రామాణికమయిన మంత్రం.

దీనిని త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.
ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/