Tuesday 2 August 2016

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు

 
                               

                                                   శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు

                                                            అలంకార ప్రియుడు,
                                 తనపై ఆలపించే భక్తి పాటలు, కీర్తనలు కు మురిసిపోయి

                                                          కోటి వరాలను అందించే

                                       కలియుగ ప్రత్యక్ష దైవం " శ్రీ వేంకటేశ్వర స్వామి ని  "

తమ పాటలతో, కీర్తనలతో కొలిచి తరించిన వారెందరో మహా వాగ్గేయకారులు, మహానుభావులు.

అందరిలో ఆద్యుడు  " శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. "

గొప్ప వాగ్గేయకారుడి గా ప్రసిద్ది చెందారు. కన్నడ వాగ్గేయ కారుడు శ్రీ పురందర దాసు గారు అన్నమయ్యను, శ్రీనివాసుని అవతారం గా ప్రశంసించారు అని అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ఖడ్గం ఐయిన “నందకం ” అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక నమ్మకం ఉంది.

నారాయణ సూరి, లక్కమాంబ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకుని సాష్టాంగ ప్రణామం ఆచరించినప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భం లో ప్రవేశించినద ని గాధ. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. ఆ ఏడుకొండలవాడు ధరించే బిరుదు “గజ్జియల ముప్పిడికఠారాన్ని ” వారికి అందచేసారుట.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతము, తండ్రి పాండిత్య ఛాయలలో పెరిగాడు.ఉపవీత సంస్కారము జరిగిన తరువాత ఇంటి గురుకులం లోనే విద్యాభాసంజరిగింది. తన ఏడేళ్ళ వయసులో గోవింద నామ స్మరణ చేస్తూ, చేయిస్తూ పొలము పనులు చేస్తుండగా పొరపాటున వేలు తెగింది. మనసు గోవిందుని పైవుంటే పొలం పనులు ఎలా సాగుతాయి…
 ఇహ అలానే వెళ్లి పొలం గట్టుపై నిదురించాడుట. అప్పుడతడు ఓ అపూర్వమైన కల కన్నాడట. అంతలో ఒక్క ఉదుటున లేచారు. చుట్టుప్రక్కల ఉన్నవారందరూ ఏమయ్యింది అని ప్రశ్నించగా , ఇలా వివరించాడు….

“కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు శ్రీ వేంకటా ద్రీశుడంటి”

అంటూ, ఇక నాకు ఈ ఐహిక బంధాలు వద్దు నేను వెంటనే తిరుమల వెళ్ళాలి అని అక్కడ నుండే బయలు దేరాడు అన్నమయ్య. ఆ తిరుమలేశుని మహిమ వల్లనె, ఆ సమయంలో అటుగా తిరుమల యాత్రికులవలె సనకసనన్దాదులనె మునీసులు పసుపు బట్టలు కట్టుకుని తలపైముడుపులు పెట్టికుని వెళుతున్నరుట…వారితో పాటు వెళ్ళిపోయారు… తల్లితండ్రులను మరిచారు, ఆకలి దప్పులు మరిచారు. అంత దూరం కాలి నడకన చేరుకున్నారు…. ఆ ఏడుకొండలు చూడగానే అన్నమయ్య కీర్తన చేసారు…

“అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పది వేల శేషుల పడగల మయము”
అంటూ కొండపైకి వెళ్లారు…

అలా అన్నమయ్య ఎన్నో అద్భుత కీర్తనలు చేసారు. వారు సంకీర్తనా చార్యుడు, పంచ మాగమ సార్వ భౌముడు. తెలుగు సాహితి చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య కు “పద కవితా పితామహుడు” అని బిరుదు ఉన్నది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ని, అహోబిలం లో శ్రీ నరసింహ స్వామిని ,ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 36000 కు పైగా సంకీర్తనలను రచించారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకిర్తనాచార్యులకు అన్నమయ్య మార్గ దర్శకుడు.

శ్రీ వారి సేవలో ఎన్నోకీర్తనలు రచించి, తరించి ఎందరికో మార్గ దర్శకుడైన అన్నమయ్య జన్మచరితార్ధమైనది. ఇంచుమించు 85 సంవత్సరముల పాటు ఆయన తిరుమలలోనే వున్నారు.వారి కీర్తనలు జగత్ విఖ్యాతం చెందాయి.