Friday 5 June 2020

శ్రీ మద్భగవద్గీత /మొదటి అధ్యాయము


శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 
 శ్రీ మద్భగవద్గీత

మొదటి  అధ్యాయము

అర్జున విషాదయోగం

ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ----
 1  సంజయా ! ధర్మ భూమి అయిన కురుక్షేత్రంలో  యుద్ధం చేసేందుకు సమకూడుకొనిన  మా దుర్యోధనాదులును , ఆ పాండవులనూ ఏమి చేశారు .
సంజయుడు చెబుతున్నాడు
2      ధృతరాష్ట్ర  మహారాజా ! మరి కాసస్సేపటిలో యుద్ధం ప్రారంభమవుతుందీ అనగానే    నీ కొడుకైన దుర్యోధనుడు , పాండవుల సైన్య వ్యూహమును చూసి , ఆచార్యులైనా  ద్రోణుణ్ణి  సమీపించి ఇలా  అన్నాడు

౩ ఆచార్యా , బుద్ధిశాలీ , మీ శిష్యుడూ అయినా ద్రుపదానందనుడు అగు ద్రుష్టద్యుమ్నునిచే వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి .

4 . ఆ పాండవ సైన్యంలో, భీమార్జునల కే మాత్రమూ తీసిపోని వారైన యుయుధాన (సాత్యకి ) విరాట , ద్రుపదాదులు---

5  మరియు - ధృష్టకేత , చేకితాన , కాశీరాజ, పురుజిత్ , కుంతిభోజ , శైబ్యదులు

6  యుధామన్యుడు,ఉత్తమౌజుడు , అభిమన్యుడు , ద్రౌపదీ తనయులైన ఉప పాండవులూ మొదలైన వారంతా కూడా వారి పక్షాన  మహారధులే ( మహారథి -  పదివేలమంది విలుకాండ్రతో ఏకాకిగా , ఏకకాలంలో  యుద్ధం చేసి గెలవగల వీరుడు.)

7  బ్రాహ్మణోత్తముడవైన ద్రోణాచార్యా ! ఇక మన సైన్యం లో ఉన్న మహావీరులను చెబుతాను విను .

8  మీరు , భీష్ముడు ,కర్ణుడు , కృపాచార్యుడు , అశ్వద్ధామ , వికర్ణుడు , సౌమదత్తి , జయద్రధుడు  మరియు

9  నా కొరకు తమ ప్రాణాలనైనా విడువగలవాళ్ళు , అస్త్ర శస్త్ర సంపన్నులు , యుద్ధ  విద్యా విశారదులును ఐన అనేకమంది ఇతర శూరులు  మన వైపున ఉన్నారు .

10  అపరిమితమైన మన సైన్యం భీష్ముడి  చే రక్షింపబడుతూ  ఉంది . పరిమితమైన ఆ పాండవసైన్యం భీముడి సంరక్షణ  లో ఉంది.

11  కాబట్టి , మన పక్షాన గల మీరందరూ కూడా మీ నిర్ణీత స్థానాలను  విడువకుండా నిలిచి  మన నాయకుడైన భీష్ముణ్ణి  రక్షిస్తూ  ఉండండి .

12  ఆ మాటలు వినిన కురువృద్ధుడూ , తాతగారూ  ఐన భీష్ముడు రారాజును సంతోషపరచేందుకై సింహనాదం చేసి శంఖాన్ని  పూరించాడు.

13  అది వినిన కౌరవ వీరులందరు  కూడా శంఖాలను పూరించారు . భేరీ  , ఫణవానక, గోముఖాదులను మ్రోగించారు . ఆ శబ్దాలు దిక్కులన్నింటా  నిండిపోయాయి .

14  , 15  . అప్పుడు , శ్వేతాశ్వాలను పూంచిన రధం మీద ఉన్నవారై కృష్ణాఅర్జునులు దివ్య శంఖాలను పూరించారు. శ్రీకృష్ణుడు " పాంచజన్యం " ను , అర్జునుడు " దేవదత్త"  మనే శంఖమును , భీముడు భయంకరమైన " పౌండ్ర " మనే శంఖాన్ని పూరించారు .

16 . పాండవ పక్షాన రాజైన కుంతీ పుత్రుడు యుధిష్ఠిరుడు " అనంత విజయం " నకులుడు " సుఘోషము " , సహదేవుడు " మణిపుష్పకము ". అనే శంఖాలను  పూరించారు.

17  మేటి విలుకాడైన కాశీరాజు , మహారథి అయిన శిఖండి --- ఓడిపోవడం అనేది ఏనాడూ  ఎరుగని మహావీరులైన దృష్టద్యుమ్న , విరాట, సాత్యకులు .

18  ద్రుపదుడూ , ద్రౌపది  కొడుకులైన  ఉప పాండవులైదుగురు - ఇతరులైన రాజులు - యోధా గ్రేసరుడైన  సుభద్ర  కొడుకు అభిమన్యుడు వీళ్లంతా  వేరువేరుగా తమ తమ శంఖాలను  అనేక పర్యాయాలు  ఊదారు.

19  ఆ శంఖ ధ్వని కౌరవుల గుండెలను  చీల్చి వేస్తూ , భూమ్యాకాశాలను  నిండి ప్రతిధ్వనించింది .

20 ,  21  ఓ రాజా  ఆ  వ్యవస్థ పిమ్మట , కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను  చూస్తూ -శస్త్రాదులనూ, ధనుస్సులను  ధరించి , కృష్ణునితో   ఓ అచ్యుతా ! మన రధాన్ని  ఒకసారి రెండు  సేనల మధ్య నిలుపుమని  అడిగెను .

22 , 23  కృష్ణా !  దుష్టబుద్ధియైన ఆ దుర్యోధనుడిని గెలిపించడం కోసం మాతో సమరానికి  సంసిద్ధులై  వచ్చి నిలిచిన వారెవరో మనలోని ఎవరెవరు - వారిలోని ఎవరెవరితో యుద్ధం చేయాలో నిర్ణయించాలంటే వారందరిని చేరువగా  చూడాలని  అర్జునుడు పలికెను .

సంజయుడు చెబుతున్నాడు:-

24 , 25  అర్జునుడలా కోరగానే శ్రీకృష్ణుడు రధాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు . భీష్ముడు, ద్రోణుడు  మొదలైన మహావీరులకు అభిముఖంగా రధాన్ని నిలిపి -" అదిగో  కౌరవ కూటం . చూడవయ్యా అర్జునా " అన్నాడు శ్రీకృష్ణుడు.

26  , 27  . రెండు సేనలకి మధ్య రథారూఢులై యున్న అర్జునుడు - ఆ రెండు సేనలలోను యుద్ధోత్సాహులై నిలిచి ఉన్న తండ్రులను , తాతలను , గురువులను ,మేనమామలను, సోదరులను , కుమారులను , మనుమలను, స్నేహితులను , బావలను- ఇతరులైన స్వజనులనూ అందరిని  చూసాడు .


28 .సమర భూమికి వచ్చియున్న  బంధువులను  అందరిని  చూచి , కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోకసంతప్తుడై  ఇట్లు పలికెను.

29 . అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! సమరోత్సాహం తో రణరంగమున నిలిచియున్న ఈ స్వజనసమూహమును జూచి , నా అవయములు
శిధిలమగుచున్నవి . నోరు ఎండిపోవుచున్నది . శరీరమునందు వణకు, గగుర్పాటు కలుగుచున్నవి .

30 . గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది . చర్మము తపించిపోవుచున్నది . మనస్సు భ్రమకు  గురిఅయినట్లు అనిపించుచున్నది .కనుక ఇక్కడ నిలబడలేక పోవుచున్నాను .

31  . ఓ కేశవా ! పెక్కు అపశకునములు కనబడుచున్నవి .యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు .

32  ఓ కృష్ణా ! నాకు విజయము గాని, రాజ్యము గాని , సుఖములు గాని అక్కరలేదు . గోవిందా ! ఈ రాజ్యము వలనగాని , ఈ భోగములవలన గాని, ఈ జీవితము వలన గాని ప్రయోజనము లేదు .

33 . మనము ఎవరికై ఈ రాజ్యమును , భోగములను , సుఖములను కోరుకున్నామో, వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చియున్నారు .

34 . గురువులు ,తండ్రులు , తాతలు ,కొడుకులు , మనుమలు , మేనమామలు , మామలు , బావమరుదులు , ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి చేరి యున్నారు .

35  .ఓ మధుసూదనా ! ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై  చెప్పనేల ? అట్లే వీరిలో ఎవ్వరినైనను నన్ను చంపబూనిననూ , నేను మాత్రము వీరిని చంపనే  చంపను.

36 . ఓజనార్దనా ! ఈ ధార్తరాష్ట్రులను   చంపి  మనము బావుకొనునది  ఏమి ? ( మనము మూట కట్టుకొనునది  ఏమి) ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును .

37 . కనుక ఓమాధవా !  మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు . స్వజనులను చంపిన మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును .
38 , 39 . లోభకారణముగ భ్రష్ట చిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను , మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో , ఓ జనార్దనా! కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏలఆలోచింపరాదు .

40 . కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును . ధర్మము అంతరించి పోయినప్పుడు కులము నందు అంతటను పాపమే వ్యాపించును .

41 .ఓ కృష్ణా! అధర్మము ( పాపము ) పెచ్చుపెరిగి పోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితలు అగుదురు . ఓ వార్ష్ణేయా ! స్త్రీలు దూషితలు అయినచో వర్ణసాంకర్యము  ఏర్పడును .

42 . వర్ణసాంకర్యము కులఘాతకులను , కులమును నరకమునందు  పడవేయును. పిండోదకములు  ( శ్రాద్ధతర్పణములు ) లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు .

43 . వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకులయొక్క సనాతన కులధర్మములు  , జాతిధర్మములు నష్టమగును .

44 . ఓ జనార్దనా! కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా ( కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి .

45 . అయ్యో ! మనము బుద్ధిమంతులమైఉండియు రాజ్య సుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తలమై, ఈ ఘోరపాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము - ఇది ఎంత  దారుణము ?

46 . శస్త్రరహితుడనై. ఎదురింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను ,  అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును .

సంజయ  ఉవాచ
47 . సంజయుడు పలికెను - అర్జునుడు ఈ విధముగా పలికి  శోకసంవిగ్నమానసుడై , యుద్ధభూమియందు ధనుర్భాణములను త్యజించి , రథము వెనుక భాగమున చతికిలబడెను .

ఓం తత్సదితి శ్రీ మద్భాగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగోనామ ప్రధమో అధ్యాయః .