Friday 5 June 2020

అధ ద్వితీయో అధ్యాయః --- సాంఖ్య యోగః


ఓం శ్రీ కృష్ణపరమాత్మనే  నమః 
అధ ద్వితీయో  అధ్యాయః ---  సాంఖ్య యోగః
సంజయ ఉవాచ
1 . సంజయుడు పలికెను -- ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని  కనులలో అశ్రువులు  నిండియుండెను . అవి అతని వ్యాకులపాటును , శోకమును తెలుపుచుండెను . అట్టి అర్జునుని శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను .

శ్రీ భగవాన్ ఉవాచ

2 . శ్రీ భగవానుడు ఇట్లనెను - ఓ అర్జునా ! తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించింది ? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడునదియు కాదు . స్వర్గమును    ఇచ్చునదియు  కాదు, కీర్తిని కలిగించునదియు  కాదు.

3 . కావున  ఓ అర్జునా! పిరికితనమునకు  లోను కావద్దు . నీకిది  ఉచితము కాదు. ఓ పరంతపా ! తుచ్ఛమైన ఈ హృదయ  దౌర్బల్యమును  వీడి , యుద్ధమునకై నడుము  బిగింపుము .

4 . అర్జునుడు పలికెను -- ఓ మధుసూదనా ! పూజ్యులైన భీష్మ పితామహుని , ద్రోణాచార్యులను యుద్ధమున  ఎదురించి బాణములతో ఎట్లు పోరాడగలను ? ఏలనన ఓ అరిసూదనా , ఈ ఇరువురును నాకు  పూజ్యులు .

5 . మహానుభావులైన ఈ గురుజనులను  చంపకుండా బిచ్చమెత్తుకొనిఅయినను  ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను , రక్తసిక్తములైన రాజ్యసంపదలను , భోగములను నేను మాత్రమే అనుభవింపవలసి యుండును గదా !

6 . ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా ? లేక చేయకుండుట శ్రేష్టమా? అనునది ఎరుగము . యుద్ధమున వారిని మనము జయింతుమా ? లేక మనలను  వారు జయింతురా ? అను విషయమును గూడ ఎరుగము.మనకు ఆత్మీయులైన ధార్తరాష్త్రులే ఇచ్చట మనలను ఎదిరించి ( పోరాడుటకు) నిలిచి యున్నారు . వారిని చంపి , జీవించుటకును మనము ఇష్టపడము .

7 . కార్పణ్యదోషము( పిరికితనం ) నకు లోనై , నా స్వభావమును కోల్పోయి  గిలగిలలాడుచున్నాను . ధర్మాధర్మముల విచక్షణకు  దూరమై,  నా కర్తవ్యమును  నిర్ణయించు కొనలేకున్నాను . నాకునిజముగా శ్రేయస్కరమైన దానిని  తెలుపుము . నేను నీకు శిష్యుడను . శరణాగతుడను , ఉపదేశింపుము .


8 . ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది . సిరిసంపదలతో  గూడిన తిరుగులేని  రాజ్యాధికారము లభించినను , కడకు సురాధిపత్యము ప్రాప్తిమ్చినను  ఈ శోక దాహము చల్లారును పాయమును  గాంచ లేకున్నాను.

సంజయ ఉవాచ

9 . సంజయుడు పలికెను - ఓ రాజా ! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన  అర్జునుడు, " నేను యుద్ధము చేయనే చేయను " , అని స్పష్టముగా నుడివి, మౌనము వహించెను .

10 . ఓ ధృతరాష్ట్రా! ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునిని  జూచి,శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు  పలికెను.


శ్రీ  భగవాన్ ఉవాచ
శ్రీ భగవానుడు  పలికెను -- ఓ  అర్జునా ! శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు . పైగా  పండితుని( జ్ఞాని ) వలె మాట్లాడుచున్నావు . పండితులైనవారు ప్రాణములు  పోయిన వారిని గూర్చి గాని , ప్రాణములు  పోని వారిని గురించిగాని శోకింపరు.

12 . నీవు గాని , నేను గాని, ఈ  రాజులు గాని ఉండని కాలమే లేదు . ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు . ( అన్ని కాలములలోను  మనము ఉన్నాము . ఆత్మ శాశ్వతము . అది  అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు .

13 . జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము , యవ్వనము , వార్ధక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తి  కలుగును .ధీరుడైనవాడు ఈ విషయమున మోహితుడు కాడు.

14 . ఓ కౌంతేయా ! విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు , సుఖ దుఃఖములు  కలుగుచున్నవి . అవి ఉత్పత్తి వినాశ శీలములు . అనిత్యములు . కనుక భారతా ! వాటిని సహింపుము ( పట్టించుకొనకుము ) .

15 .ఏలనన ఓ పురుష శ్రేష్టా !ధీరుడైనవాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును . అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు .అతడే మోక్షమును పొందుటకు  అర్హుడు .

16 . అసత్తు  అనుదానికి ( అనిత్యమైన దానికి ) ఉనికియే  లేదు. సత్తు అనుదానికి లేమి  లేదు. ఈ విధముగ ఈ రెండిటి యొక్క వాస్తవస్వరూపములను తత్వజ్ఞాని  అయినవాడే ఎరుంగును .

17 .నాశ రహితమైన  ఆ సత్యము ( పరమాత్మ తత్వము) జగత్తు నందు అంతటను వ్యాపించియున్నదని ఎరుంగుము . శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు .

18 . ఈ శరీరములు  అన్నియును నశించునవియే . కానీ జీవాత్మ నాశ రహితము , అప్రమేయము ( అనిర్వచనీయము ) , నిత్యము. కనుక( ఈ విషయమును  ఎరింగి ) ఓ భరతవంశీ ! అర్జునా ! నీవు యుద్ధము  చేయుము .

19 . ఆత్మ ఇతరులను  చంపునని భావించువాడును , అది( ఆత్మ) ఇతరులచే చంపబడునని  భావించు వాడును , ఆ ఇద్దరును అజ్ఞానులే . ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు .

20 . ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు . పుట్టి ఉండునది కాదు.ఇది భావ వికారములు లేనిది ( ఉత్పత్తి, అస్థిత్వము , వృద్ధి , విపరిణామము , అపక్షయము, వినాశము  అను ఆరును భావవికారములు ) . ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము , పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు .

21 . ఓ పార్ధా ! ఈ ఆత్మ నాశ రహితము, నిత్యము అనియు , జనన మరణములు లేనిదనియు , మార్పులేనిదనియు  తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ? ఎవరిని ఎట్లు చంపును.

22 . మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి , నూతన వస్త్రములను ధరించినట్లు , జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును .

23 ఈ ఆత్మను  శస్త్రములు చేధింపజాలవు . అగ్ని దహింపజాలదు . నీరు తడుపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు .

24 . ఈ ఆత్మ చేధించుటకును , దహించుటకును, తడుపుటకును , శోషింపచేయుటకును సాధ్యము కానిది . ఇది నిత్యము. సర్వవ్యాపి , చలింపనిది ( అచలము ) స్థాణువు ( స్థిరమైనది )  సనాతనము ( శాశ్వతము) .


25 . ఈ ఆత్మ అవ్యక్తమైనది , ( ఇంద్రియగోచరము గానిది ) అచింత్యము ( మనస్సునకును అందనిది ) వికారములు లేనిది. దీనిని  గూర్చి ఇట్లు తెలిసికొనుము . కనుక ఓ అర్జునా! నీవు దీనికై  శోకింప దగదు.


26 . ఓ అర్జునా! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింప దగదు.

27 . ఏలనన పుట్టినవానికి మరణము తప్పదు . మరణించిన వానికి పునర్జన్మ  తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.

28 . ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకు ముందు ఇంద్రియగోచరములు గావు -( అవ్యక్తములు ) మరణానంతరము గూడ అవి అవ్యక్తములే - ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే  అవి ప్రకటితములు ( ఇంద్రియ గోచరములు ) అగుచుండును .ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.

29 .ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ( ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును.మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును . వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరముగా  దీనిని వినును . ఆ విన్నవారిలో కూడ  కొందరు  దీనిని గూర్చి ఏమియు ఎరుగరు .

30 . ఓ అర్జునా! ప్రతి దేహమునందును  ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది .కనుక  ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు.

31 . అంతేకాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కరలేదు . ఏలనన క్షత్రియునకు  ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరియొకటి ఏదియు లేదు .

32 . ఓ పార్ధా ! యాదృచ్చికంగా  అనగా అనుకోకుండా  తటస్థించిన  ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును . ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది .

33 . ఈ  యుద్ధము నీకు ధర్మబద్ధము . ఒకవేళ నీవు  దానిని ఆచరింపకున్నచో నీ స్వధర్మమునుండి పారిపోయినవాడవు అగుదువు . దానివలన కీర్తిని కోల్పోయెదవు . పైగా నీవు పాపము చేసినవాడవు అగుదువు.

34 . లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తిని గురించి చిలువలు పలువలుగా  చెప్పికొందురు . మాన్యుడైన పురుషునకు  అపకీర్తి మరణము కంటెను భాధాకరమైనది .

35 . ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మాన్యుడవు . యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు . అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధమునుండి పారిపోయినట్లు వీరు భావింతురు .

36 . నీ శతృవులు నీ సామర్ధ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అందురు . అంతకంటె విచారకరమైన  విషయమేముండును

37 ఓ అర్జునా  ! రణరంగమున మరణించినచో  నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమును జయించినచో  రాజ్య భోగములను అనుభవింపగలవు . కనుక కృతనిశ్చయుడై యుద్ధమునకు లెమ్ము .

38 . జయాపజయములను , లాభనష్టములను , సుఖదుఃఖములను. సమానముగా  భావించి , యుద్ధ సన్నద్ధుడవు కమ్ము  అప్పుడు నీకు పాపములు  అంటనే అంటవు.

39 . ఓ పార్ధా! ఈ ( సమత్వ ) బుద్ధిని ఇంతవరకును జ్ఞాన యోగ దృష్టితో తెల్పితిని . ఇప్పుడు దానినే  కర్మయోగ దృక్పధముతో వివరించెదను   వినుము . దానిని ఆకళింపు చేసుకుని , ఆచరించినచో  కర్మబంధములనుండి  నీవు ముక్తుడవయ్యెదవు .
40 . ఈ ( నిష్కామ ) కర్మయోగమును ప్రారంభించినచో దీనికి  ఎన్నటికిని బీజనాశము  లేదు . దీనికి విపరీత ఫలితములే యుండవు . పైగా ఈ( నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయమునుండి  కాపాడును .

41 . ఓ అర్జునా ! ఈ ( నిష్కామ) కర్మయోగమునందు  నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే  ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై , ఒక దారీ  తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా నుండును .

 42 , 43 ,44 . ఓ అర్జునా! వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమునకలై యుందురు . వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యములయొక్క  బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు . వాటి  అంతరార్ధముల జోలికే పోరు . స్వర్గమునకు మించినదేదియును లేదనియు , అదియే  పరమప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపుపల్కులు పలికెదరు . ఆ ఇచ్చకపుమాటల ఉచ్చులలోబడిన భోగైశ్వర్యఆసక్తులైన  అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు . .

45 . ఓ. అర్జునా! వేదములు సత్వ రజస్తమో గుణముల కార్య రూపములైన  సమస్త భోగములను గూర్చియు , వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును . నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనలయందును ఆసక్తిని త్యజింపుము . హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము . నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు.  అంతఃకరణమును వాసమునందుంచుకొనుము .

46 . అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము  అందుబాటులో ఉన్నవానికి  చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనకరమో , పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదములవలన అంతియే ప్రయోజనము .

47 . కర్తవ్యకర్మమునాచరించుటయందే  నీకు అధికారము కలదు . ఎన్నటికినీ దాని ఫలములయందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు . కర్మలనుమానుటయందు  నీవు ఆసక్తుడవు కావలదు . అనగా ఫలాపేక్ష రహితుడవై  కర్తవ్య బుద్ధితో  కర్మలను ఆచరింపుము .

48 .ఓ ధనంజయా ! యోగస్థితుడవై ఆసక్తిని వీడి , సిద్ధి - అసిద్ధుల యెడ సమత్వభావమును  కలిగి యుండి , కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావననే  యోగమందురు .

ఈ సమత్వబుద్ధియోగముకంటెను  సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి  చెందినది .కావున ఓ ధనంజయా!  నీవు సమస్త బుద్ధి యోగమునే  ఆశ్రయింపుము . ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు , కృపణులు.

50 . సమత్వ బుద్ధి యుక్తుడైనవాడు  పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును .అనగా కర్మఫలములు  వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూప యోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు  కౌశలము,. అనగా కర్మ బంధములనుండి ముక్తుడగుటకు  ఇదియే  మార్గం

51 . ఏలనన సమబుద్ధి యుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి , జనన మరణ బంధములనుండి
ముక్తులయ్యెదరు . అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు .

52 .మోహమనెడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన , వినబోవు ఇహపర లోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు .

53 . నానా  విధములైన మాటలను వినుటవలన విచలితమైన ( అయోమయమునకు గురయిన)నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య ( శాశ్వత ) సంయోగము ఏర్పడును .

అర్జున ఉవాచ
54 . అర్జునుడు  పలికెను . ఓ కేశవా ! సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని  యొక్క లక్షణములెవ్వి ? అతడు  ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును ? ఎట్లు నడుచును ?

శ్రీ భగవాన్ ఉవాచ

55 . శ్రీ భగవానుడు పలికెను- ఓ అర్జునా ! మనసునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి , ఆత్మ ద్వారా ఆత్మ యందు సంతుష్టుడైన వానిని , అనగా పరమాత్మ సంయోగమువలన  ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని  యందురు .

56 . దుఖఃములకు కృంగిపోని వాడును , సుఖము లకు  పొంగిపోని వాడును, ఆసక్తిని , భయక్రోధములను  వీడినవాడును ఐనట్టి  మననశీలుడు ( ముని) స్థితప్రజ్ఞుడనబడును .

57 . దేనియందును మమతాసక్తులు లేనివాడును ,అనుకూల పరిస్థితులయందు హర్షము , ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము  మొదలగు. వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును .


58 . తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా , ఇంద్రియములను ఇంద్రియార్ధముల ( విషయాదుల ) నుండి  అన్ని విధముల  ఉపసంహరించుకొనిన  పురుషుని యొక్క బుద్ధి  స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను

59 . ఇంద్రియముల ద్వారా   విషయములను  గ్రహింపని వాని నుండి ఇంద్రియార్ధములు  మాత్రమే వైదొలగును . కానీ వాటిపై ఆసక్తి మిగిలి యుండును . స్థితప్రజ్ఞునికి పరమాత్మ సాక్షాత్కారమైనందు. వలన వాని నుండి ఆ ఆసక్తి  గూడ తొలగిపోవును .

60 . ఓ అర్జునా ! ఇంద్రియములు ప్రమధనశీలములు . మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను , ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్ధముల వైపు బలవంతముగా  లాగికొనిపోవుచునే యుండును .
61 .కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకొని  ,సమాహితచిత్తుడై ( చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసినవాడై ) మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను . ఏలనన ఇంద్రియములను  వశమునందుంచుకొను  వాని బుద్ధి స్థిరంగా ఉండును.
62.
విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వలన ఆ విషయములు పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.
63.
అట్టి క్రోధము వలన వ్యామోహం కలుగుతుంది. దాని ప్రభావమున
స్మృతి చిన్నా భిన్న మగును. స్మృతి భ్రష్ట మైనందు వలన బుద్ధి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనం అగును.
64.
అంతః కరణమును వశమందు ఉంచు కొనిన సాధకుడు రాగ ద్వేష రహితుడై ఇంద్రియాలు ద్వారా విషయములను గ్రహించు చున్ననూ మనః శాంతి పొందును.
65 . మనఃప్రసన్నతను  పొందిన వెంటనే అతని దుఃఖములన్నియును నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి  అన్ని విషయములనుండియు  వైదొలగి , పరమాత్మయందు మాత్రమే  పూర్తిగా స్థిరమగును .

66 .ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక  బుద్ధి ఉండదు . అట్టి. అయుక్తమనుష్యుని  అంతఃకరణమునందు ఆస్తిక  భావమే  కలుగదు . తద్భావనా హీనుడైన వానికి  శాంతి  లభింపదు . మనశాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును .

67 . నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును . అట్లే ఇంద్రియార్ధములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క  ఇంద్రియముతో కూడి యున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును .
68  కనుక ఓ అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్నివిధములగ పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగానుండును .

69 .నిత్యజ్ఞాన స్వరూప పరమానందప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును . అది ఇతర ప్రాణులన్నిటికిని  రాత్రితో  సమానం . నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు   ప్రాణులన్నియు మేల్కొని యుండును. అది పరమాత్మ తత్వమునెరిగిన మునికి ( మననశీలునికి ) రాత్రి తో సమానం.

70  సమస్తదిశలనుండి పొంగి  ప్రవహించుచు వచ్చి చేరిన  నదులన్నియును  పరిపూర్ణమై నిశ్చలముగానున్న  సముద్రమును  ఏ మాత్రము చలింపజేయకుండానే  అందులో  లీనమగును . అట్లే సమస్తభోగములను  స్థితప్రజ్ఞుని యందు  ఎట్టి వికారములను కల్గింపకయే  వానిలో  లీనమగును. అట్టి పురుషుడే పరమ శాంతిని. పొందును. భోగాసక్తుడు శాంతిని. పొందజాలడు.


71 . కోరికలన్నిటిని  త్యజించి , మమతా - అహంకార ,స్పృహ  రహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును.


72 . ఓ అర్జునా ! బ్రాహ్మీస్థితి అనగా  ఇదియే  . ( ఇదియే బ్రహ్మ ప్రాప్తి  కలిగిన పురుషుని స్థితి) .ఈ బ్రాహ్మీస్థితిని  పొందిన యోగి ఎన్నడును మోహితుడు  కాడు.  అంత్యకాలము నందును. ఈ బ్రాహ్మీస్థితి యందు స్థిరముగా నున్నవాడు  బ్రహ్మానందమును పొందును .



ఓం తత్సదితి  శ్రీ మద్బగవద్గీతాసూపా నిషత్సు

బ్రహ్మ విద్యాయామ్ యోగాశాస్తే శ్రీకృష్ణార్జున  సంవాదే , సాంఖ్యయోగో నామ  ద్వితీయో యాధ్యాయః