Friday 12 June 2020

భగవద్గీత తృతీయోధ్యాయః- కర్మ యోగహా


ఓం  శ్రీ పరమాత్మనే నమః
అధ తృతీయో అధ్యాయః- కర్మ యోగహా
అర్జున  ఉవాచ
1 . అర్జునుడు పలికెను - ఓ జనార్దనా ! కేశవా !  నీ  అభిప్రాయమును బట్టి  కర్మ కంటెను జ్ఞానమే  శ్రేష్ఠమైనచో , భయంకరమైన ఈ  యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు .

2 . కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు . కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా  తెల్పుము .

శ్రీ భగవాన్ ఉవాచ

3 . శ్రీ భగవానుడు పలికెను- ఓ అనఘా ! ఓ అర్జునా ! ఈ లోకమున రెండు నిష్ఠలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్య యోగులకు జ్ఞానయోగము ద్వారా , యోగులకు కర్మ యోగము ద్వారా నిష్ఠ కలుగును .

4 . మనుష్యుడు  కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము  అనగా యోగనిష్టా సిద్ధి  అతనికి  లభింపదు . అట్లే కేవలము కర్మలను త్యజించినంత  మాత్రమున సిద్ధిని  అనగా సాంఖ్య నిష్ఠను అతడు పొందజాలడు.

5 . ఏ  మనుష్యుడైనను ఏ కాలమునందైనను  క్షణమాత్రము గూడ  కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు  తావులేదు . ఏలనన మనుష్యులందరును  ప్రకృతిజనితములైన  గుణములకు  లోబడి  కర్మలను చేయుటకు భాధ్యులగుదురు . ప్రతి  వ్యక్తియు  కర్మను ఆచరింపవలసియే యుండును .

6 . బలవంతముగా , బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను  నిగ్రహించి , మానసికముగా ఇంద్రియ విషయములను చింతించు నట్టి మూఢుని మిధ్యాచారి  అనగా దంభి అని యందురు .

7 . కానీ , అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని , అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా  కర్మయోగచరణమును  కావించు  పురుషుడు. శ్రేష్ఠుడు .

8 . నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము . ఏలనన కర్మలను చేయకుండుట  కంటెను చేయుటయే ఉత్తమము . కర్మలను ఆచరింపనిచో  నీ శరీర నిర్వహణము గూడ సాధ్యము కాదు .

9 . ఓ  అర్జునా ! యజ్ఞార్ధము  చేయబడు  కర్మలలో గాక ఇతర  కర్మలయందు నిమగ్నులగుటవలన  మనుష్యులు  కర్మ బంధములలో    చిక్కుపడుదురు . కనుక నీవు ఆసక్తి  రహితుడవై  యజ్ఞార్ధమే  కర్తవ్య కర్మలను  చక్కగా ఆచరింపుము

10 . కల్పాదియందు  బ్రహ్మదేవుడు  యజ్ఞ సహితముగ ప్రజలను సృష్టించి , " మీరు ఈ  యజ్ఞముల.  ద్వారా    వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె  కోరిన కోర్కెల నెల్ల తీర్చును ."అని పల్కెను.

11 ." ఈ .యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తి పరచుడు.  మరియు ఆ దేవతలు  మిమ్ములను  అనుగ్రహింతురు . నిస్వార్ధ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకొనుచు  పరమశ్రేయస్సును పొందగలరు "  అని పల్కెను.

12 . యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు ( మానవులకు ) అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు . ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన  ఈ భోగములను ఆ దేవతలకు  నివేదన చేయక తానే అనుభవించేవాడు  నిజముగా దొంగయే .

13 . యజ్ఞశిష్టాన్నమును  తిని శ్రేష్ఠపురుషులు అన్ని  పాపములనుండి ముక్తులయ్యెదరు . తమ శరీర పోషణకొరకే  ఆహారమును సిద్ధపరచు ( వండు ) కొను పాపులు పాపమునే భుజింతురు.

14 , 15 . ప్రాణులన్నియు అన్నము ( ఆహారము ) నుండి జన్మించును . అన్న ఉత్పత్తి వర్షము వలన ఏర్పడును . యజ్ఞముల వలన వర్షములు  కురియును . విహిత కర్మలు యజ్ఞములకు మూలములు . వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము . అందువలన సర్వవ్యాపియు , అవ్యయుడును ఐన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై యున్నాడు .

16 . ఓ  అర్జునా ! ఇట్లు  పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు  అనుకూలముగా ప్రవర్తింపనివాడు , అనగా తన కర్తవ్యములను  పాటింపక , ఇంద్రియ సుఖలోలుడైన  వాడు  పాపి . అట్టివాని యొక్క జీవితము వ్యర్ధము,.

17 . సచ్చిదానందమను పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని  ఐన పరమాత్ముడు  నిత్యమైన ఆత్మయందే  రమించును . అతడు పూర్ణకాముడు . కనుక ఆత్మ యందే తృప్తి నొందును,. అతడు ఆత్మ యందే నిత్య సంతుష్టుడు . అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు .


18  అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలన , చేయకుండుట వలనను అతనికి  ఎట్టి ప్రయోజనమూ  ఉండదు .అతనికి సర్వ ప్రాణుల తోడను స్వార్థ పరమైన సంబంధము ఏ విధముగను ఏ మాత్రము ఉండదు.

19 . అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను  చక్కగా ఆచరింపుము . ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు  పరమాత్మ ప్రాప్తి కలుగును .

20 . జనకుడు మొదలగు  జ్ఞానులు గూడ  ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుటవలననే  పరమసిద్ధిని  పొందిరి . కావున నీవును. లోకహితార్ధమై    కర్మలను ఆచరించుటయే  సముచితము .

21 . శ్రేష్ఠుడైన  పురుషుని ఆచరణమునే ( ప్రవర్తననే ) ఇతరులును అనుసరింతురు . అతడు  నిల్పిన ( ప్రతిష్టించిన ) ప్రమాణములనే లోకులందరు పాటించెదరు .

22 . ఓ  అర్జునా ! ఈ ముల్లోకములయందును  నాకు  కర్తవ్యము   అనునదియే  లేదు . అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను  పొందనిదియును లేదు. ఐనను. నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను  .


23 . ( ఏలనన ) ఓ  పార్ధా ! ఎప్పుడైనను నేను  సావధానుడనై. కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు. గొప్ప  హాని సంభవించును . ఎందుకనగా మనుష్యులందరును  అన్ని విధముల నా మార్గమునే  అనుసరింతురు .

24 . నేను కర్మలను. ఆచరించుట మానినచో ఈ లోకములన్నియు. నశించును . అంతే గాదు, లోకములందు  అల్లకల్లోలములను ( సాంకర్యములు ) చెలరేగును . ప్రజానష్టము వాటిల్లును . అప్పుడు  అందులకు  నేనే   కారకుడనయ్యెదను .

25 . ఓ భారతా ( అర్జునా) అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటినే ఆచరించినట్లుగా  విద్వంసుడు ( జ్ఞాని ) కూడా లోకహితార్ధమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలెను .

26 . పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత,కర్మలను ఆసక్తితో ( ఫలాసక్తితో ) ఆచరించు  అజ్ఞానుల  బుద్ధులను భ్రమకు లోను   చేయరాదు . అనగా కర్మలయందు వారికి  అశ్రద్ధ  ను  కలిగింపరాదు  . పైగా తాను కూడా       శాస్త్ర విహితములైన  సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో. గూడ అట్లే. చేయింపవలెను .

27 . వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతి గుణముల  ద్వారానే చేయబడుచుండును . అహంకార విమూదాత్ముడు ( అహంకారముచే మోహితమైన అంతః  కరణము గల అజ్ఞాని  ) ' ఈ కర్మలకు నేనే కర్తను ' అని భావించును.

28 . కాని, ఓ మహాబాహూ ! ( అర్జునా) గుణవిభాగ తత్వమును , కర్మ  విభాగ  తత్వమును తెలిసి కొన్న జ్ఞానయోగి గుణములే  గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని  భావించి , వాటి యందు. ఆసక్తుడు కాడు.

29  .ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ  గుణములయందును , కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు . అట్టి  మిడిమిడిజ్ఞానముగల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన  జ్ఞాని అయినవాడు భ్రమకు ( ఊగిసలాటకు ) గురి చేయరాదు. .

30 . అంతర్యామిని , పరమాత్మను అయిన నా యందే నీ  చిత్తమును  ఉంచి , కర్మలనన్నింటినీ నాకే  అర్పించి , ఆశా మమతా  సంతాపములను వీడి , యుద్ధము. చేయుము .

31  . దోష దృష్టి లేకుండ శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు  గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు .


H౩౨  కానీ నా యందు దోషారోపణ చేయుచు , నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు  సమస్త జ్ఞాన విషయములయందును మోహితులై ( విపరీత జ్ఞానోపహతులై ) భ్రష్టులై , కష్టనష్టములు పాలయ్యెదరని ఎఱుంగుము.

33 . సమస్త ప్రాణులును  తమ తమ ప్రకృతులను అనుసరించి ( స్వభావములకు  లోబడి ) కర్మలు  చేయుచుండును . జ్ఞానియు తన ప్రకృతిని ( స్వభావమును ) అనుసరించియే క్రియలను ఆచరించును . ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను  ఎట్లు  త్యజింప గలరు .

34 . ప్రతి ఇంద్రియార్ధమునందును ( ప్రతి ఇంద్రియ విషయము నందును ) రాగ ద్వేషములు దాగియున్నవి . మనుష్యుడు ఈ రెండిటికిని వశము కాకూడదు . ఏలనన ఈ రెండే మానవుని  శ్రేయస్సునకు  విఘ్నకారకములు , మహా శత్రువులు .

 35 .పరధర్మమునందు ఎన్నో సుగుణములు  ఉన్నను స్వధర్మమునందు  అంతగా. సుగుణములు లేకున్నను చక్కగా  అనుష్టింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే  ఉత్తమము  . స్వధర్మాచరణము నందు మరణించుటయు శ్రేయస్కరమే . పరాధర్మాచరణము భయావహం .

అర్జున ఉవాచ
36 .అర్జునుడు పలికెను ! ఓ కృష్ణా ! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు  బలవంతము  చేసినట్లుగా  దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను. చేయుచుండును ?

శ్రీ భగవాన్  ఉవాచ

37 . శ్రీ భగవానుడు పలికెను -- రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము .ఇది క్రోధరూపమును దాల్చును . ఇది మహాశనము . భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా  అంతులేని పాపకర్మాచరణములకు  ఇదియే ప్రేరకము . కనుక ఈ విషయమున దీనిని పరామశత్రువుగా  ఎరుంగుము .

38 . పొగచే అగ్నియు , ధూళిచే  అద్దము , మావి చే గర్భము కప్పివేయబడునట్లు ,  జ్ఞానము , కామము చే ఆవృతమై  ఉండును.

39 . ఓ అర్జునా ! కామము అగ్నితో  సమానమైనది . ( అగ్ని వంటిది ) . అది ఎన్నటికిని చల్లారదు . జ్ఞానులకు అది నిత్యవైరి . అది మనుష్యుని విజ్ఞామును  కప్పివేయుచుండును .

40 . ఇంద్రియములు , మనసు , బుద్ధి ఇవి కామమునకు. నివాసస్థానములు . ఇది( ఈ కామము) మనోబుద్ధిఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి , జీవాత్మను మోహితునిగా  చేయును .

41 . కావున ఓ అర్జునా! మొదట ఇంద్రియములను వశపరచుకొనుము . పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహా పాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులు నొడ్డి  రూపుమాపుము

42 . స్థూలశరీరముకంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, అని పేర్కొందురు . ఇంద్రియముల కంటెను మనసు , దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి . ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది , సూక్ష్మమైనది  ఆత్మ.

43 . ఈ విధముగా  బుద్ధి కంటెను ఆత్మపరమైనదని  అనగా సూక్ష్మము , బలీయము , మిక్కిలి శ్రేష్ఠము అయినదని తెలిసి కొని ఓ మాహాబాహూ! బుద్ధి ద్వారా మనసునువశపరుచుకొని , దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము .

 ఓమ్ తత్సదితి శ్రీ మద్భాగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం  యోగ శాస్త్రే ,
 శ్రీ కృష్ణార్జున సంవాదే  కర్మ యోగో  నామ తృతీయో అధ్యాయః