Wednesday 30 December 2020

రామ నామం విశిష్టత

 రామ నామం విశిష్టత



శ్రీరాముడి కంటే శ్రీరామ నామం గొప్పది అనడం వెనక ఆంతర్యము..


"రామ"..! ఈ మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. 

ఈ మంత్ర జపం వల్ల.. అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతాయి. 

అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే..కూడా రామ నామమే గొప్పదని చాలా కథలు మనకు 

చెబుతూ ఉంటాయి. 


అసలు రాముడితో పుట్టిన రామ నామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది..


రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. 

తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి

మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుంది.

చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి 

ఈ రామనామం సహాయపడుతుంది. 

కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి.


భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి. 

అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి, మహిమ ఉంటుంది. 

మన హిందువులకు ఉన్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. 

ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామ నామం విశిష్టత, రామ నామం గొప్పదనం, 

రామనామం శక్తి సామర్థ్యాలను తెలుసుకుందాం..


రామ నామం పుట్టుక..

తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం.. 

రెండు మహా మంత్రాల నుంచి పుట్టింది. 

ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో 

రా..అనే అక్షరం జీవాక్షరం. 

అలాగే ఓం నమ: శివాయ అనే పంచాక్షరి మంత్రంలో 

మ..అనేది జీవాక్షరం.

అంటే.. ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే.. అర్థం ఉండదు. 

అందుకే.. ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా, మ అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. 

ఈ రెండు అక్షరాలు లేకపోతే.. 

ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు. 

అందుకే ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం పుట్టింది.


శివకేశవ మంత్రం..

ఓం నమో నారాయణాయలో రా, 

ఓం నమ: శివాయలో మ అనేవి జీవాక్షరాలు. 

అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైంది. 

అందుకే ఈ మంత్రాన్ని హరిహరతత్వం కలిసిన మహామంత్రమని పిలుస్తారు.


లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు. 

అయితే.. రాయిపై రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. 

ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి.. 

తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా.. 

తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది.

తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. 

కానీ.. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది.

రాముడు ఆశ్చర్యపోయాడు.

తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు. 

అప్పుడు హనుమంతుడు.. 

రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి. 

మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా.. 

అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు.

ఇలా రాముడి కంటే.. రామ నామం ఎంతో బలమైనది, శక్తివంతమైనది, విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు.


రామ నామం అర్థం..

రామ అనే మంత్రంలో ర, అ, మ అనే అక్షరాలున్నాయి. 

ర అంటే అగ్ని, 

అ అంటే సూర్యుడు, 

మ అంటే చంద్రుడు అని అర్థం. 

అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులున్నాయని వివరిస్తుంది.


రామ నామ జపం విశిష్టత..

రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని 

నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. 

అలాగే మ అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తుంది.


విష్ణుసహస్రనామం..

రామ రామ రామ అని మూడు సార్లు జపం చేస్తే.. 

విష్ణు సహస్ర నామం చేసినంత ఫలితం లభిస్తుందట.


రామ నామ మంత్రం..

శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 

13 అక్షరాల నామమంత్రం. 

ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. 

సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి.. రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. 

కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది.


శనీశ్వరుడినే జయించిన రామనామం..

పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాలపాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు. 

అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా.. 

తాను రామనామ జపంలో ఉన్నానని... 

అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. 

శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా.. 

రామనామ జపం పూర్తవలేదు. 

దీంతో.. శనీశ్వరుడు.. రామనామం జపించేవాళ్ల దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్లిపోయాడు. 

కాబట్టి రామ నామాన్ని జపించేవాళ్లకు శనిబాధలు ఉండవు.


 శ్రీరాముని యొక్క శ్రీ రామ నామం జపించడం కానీ 

శ్రీ రామకోటి ని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి.


మన పురాణాల్లో " ఆది కావ్యం గా "చెప్పబడుతున్న 

వాల్మీకి మహర్షి యొక్క  "శ్రీరామాయణం" లో చెప్పబడింది.

రామ నామం యొక్క గొప్పదనం శ్రీ రామాయణం లో అడుగు అడుగున చెప్పబడుతుంది.

ఈ నామాన్ని చిన్నపిల్లల నుంచి వృద్ధులు వరకు   జపించవచ్చు స్మరించవచ్చు రాయవచ్చు.

 

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి 

ఆది దేవుడు అయినా "శివపరమాత్ముడు"  నిత్యం రామనామం జపిస్తారు అంత గొప్పది. " రామ నామం"

 

అందుచేత యావన్మంది భక్తకోటి రామ నామం యొక్క గొప్పతనం తెలుసుకొని రామకోటి  రాయండి. జపించండి మీకు శ్రీరాముని యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి.

(సేకరణ)