Saturday 5 March 2022

శ్రీ అరుణగిరి ప్రదక్షిణ

 శ్రీ అరుణగిరి ప్రదక్షిణ


అరుణాచల దివ్యక్షేత్రమునకు అత్యుత్తమ నివాళిగా చెప్పబడిన కార్యము "గిరి ప్రదక్షిణము". అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి, అంత్యమున శివలోక ప్రాప్తి కలుగును.
దీనిపై ఎన్నో  గుహలు కలవు.
వాటిలో ఎందరో మహాత్ములు నేటికీ తపము చేసికొనుచున్నారు.
ఈ గిరి హిమాలయముల కన్నాప్రాచీనమైనది మరియు కైలాసము కన్నా మహత్తరమైనది. ఎందువలననగా

కైలాసము - శివుని నివాసము
అరుణాచలము - సాక్షాత్తు శివుడు

ఎన్నో యుగములుగా అరుణాచలము ఎందరో ఉపాసకులను తన వైపుకు ఆకర్షించి వారిని
కృతార్థులను చేసినది. ఈ పర్వతము చుట్టూ ఇరువది అయిదు మైళ్ళ వరకు దీని దివ్య తేజస్సు పడును. ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్షా   నియమములు లేవు.
ఇంతటి సౌలభ్యము గల ఏకైక క్షేత్రము అరుణాచలము.

"యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే"

అని స్కాందపురాణము వర్ణించినది .
అరుణగిరి ప్రదక్షిణ గూర్చియే. జన్మాంతరముల యందు చేసిన పాపములు గూడా గిరి ప్రదక్షిణ వలన నశించును.
స్కాందపురాణము "గిరి ప్రదక్షిణ" వైభవమును ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది.
గిరి ప్రదక్షిణ చేసిన వారికి
1. కోటి అశ్వమేధ యాగములు,
2. కోటి వాజపేయ యాగములు,
3.  సమస్త తీర్థముల యందు స్నానములు చేసిన ఫలితము అనుగ్రహింపబడును.

మొదటి అడుగుతో భూలోకము, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గలోకము అనుగ్రహింపబడును.
అంతేగాదు, మొదటి అడుగుతో మానసిక పాపములు, రెండవ అడుగుతో శారీరిక పాపములు, మూడవ అడుగుతో వాచక పాపములు నశించును. ధ్యానము నందు కుదరని ఏకాగ్రత గిరి ప్రదక్షిణ వలన సంభవమగును.

సకల దేవతలు, నవగ్రహములు, బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు గూడా సర్వకాలముల యందు గిరి ప్రదక్షిణ చేస్తూ యుండెదరు. ఉత్తరాయణ పుణ్యకాల సమయమందు (కనుమ పండుగ నాడు) మరియు కార్తీక మాస కృత్తికా దీపోత్సవ మూడవ దినమున సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే, పార్వతీ మాత మరియు తన భూతగణ సహితముగా, గిరి ప్రదక్షిణ చేస్తాడనిన ఈ ప్రదక్షిణ వైభవము వర్ణించుట ఎవరి తరము. దిక్పాలకులు మరియు నవగ్రహములు గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే వారు వారివారి స్థానములు పొందిరి. పార్వతీ మాత గూడా గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే పరమేశ్వరుని వామార్ధభాగమును పొంది పార్వతీపరమేశ్వరులు "అర్ధనారీశ్వరులు" అయినారు.
1. భానువారము ప్రదక్షిణ చేయువారు సూర్య మండలమును బేధన చేసి శివసన్నిధి పొందెదరు.

2. సోమవార ప్రదక్షిణము అజరామరత్వమును కలిగించును.

3. మంగళవార ప్రదక్షిణము సార్వభౌమత్వమును ఒసగును.
4. బుధవార ప్రదక్షిణము మహాపాండిత్యమును ప్రసాదించును.
5. గురువార ప్రదక్షిణము సర్వులు నమస్కరించెడి లోకగురుత్వమును కటాక్షించును.
6. శుక్రవార ప్రదక్షిణ చేయువారికి సకల సంపదలూ కలిగి, విష్ణుపధమును పొందదరు.
7. శనివార ప్రదక్షిణము వలన సమస్త గ్రహ పీడలూ తొలగిపోవును.
అదృశ్య రూపమున ప్రదక్షిణ చేయు దేవతలు, గిరి ప్రదక్షిణ చేయువారి భక్తిశ్రద్ధలకు సంతసించి అడగకనే వరములు అనుగ్రహించెదరు.

పౌర్ణమి, అమావాస్య మరియు ఇతర పర్వదినముల యందు చేయు గిరి ప్రదక్షిణ విశేష ఫలితములను అనుగ్రహించును.

"చిత్రం వటతరోర్మూలే వృద్ద శిష్యః గురుర్యువాః
గురోస్తూ మౌనం వ్యాఖ్యానం, శిష్యోస్తు ఛిన్న సంశయః"

వట వృక్షము నీడన ఆసీనుడై, చిన్ముద్ర పట్టి, మౌనమే వ్యాఖ్యానముగా యున్న యువకుడైన గురువు, తన వద్దకు చేరిన వృద్ధ శిష్యుల సంశయములు తీర్చుచుండెను.
ఆ స్వరూపమే "శ్రీ గురుదక్షిణామూర్తి".
పరమశివుని జ్ఞానరూపమైనట్టి శ్రీ దక్షిణామూర్తిని వేదములు బహుదా ప్రస్తుతించినవి. అటువంటి దివ్య స్వరూపమైన దక్షిణామూర్తి యే వటవృక్షము నీడన ఆసీనులై యున్నారో, ఆ వృక్షము అరుణాచలము పైనే యున్నది.
ఈ గిరికి ఉత్తర దిక్కుగా యున్న ఉన్నత శిఖరముపై ఈ స్వామి ఆసీనుడై యున్నాడని పురాణవచనము. ఈ స్వామినే "అరుణగిరి యోగి" అని పేర కొలిచెదరు. గిరి ప్రదక్షిణము చేసెడి వారు, వారికి తెలియకుండానే ఈ స్వామికి కూడా ప్రదక్షిణ చేసెదరు. అందువలననే అరుణాచల గిరి ప్రదక్షిణము మహత్తరమైన జ్ఞానమును కూడా అనుగ్రహించును.

అరుణగిరి ప్రదక్షిణమునకు ప్రత్యేక సమయమంటూ లేదు. ఎప్పుడైనా ప్రదక్షిణ చేయ్యవచ్చును. స్నానము చేసి, శుభ్రమైన వస్త్రములు ధరించి, భస్మధారణ గావించి, శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయవలెను. ప్రదక్షిణ చేయు సమయమున త్వరపడి నడవక నిండు గర్భిణి వలె నెమ్మదిగా అడుగులు వేయవలెను. దేవ, ఋషి, సిద్ధ, గంధర్వ, కిన్నెర, కింపురుష, నవగ్రహ, దిక్పాలక గణములన్నియూ ప్రదక్షిణ మార్గము యొక్క కుడి వైపు ప్రదక్షిణ చేయును. కనుక వారి త్రోవకు అడ్డము రాని రీతిలో మార్గాముకు ఎడమ వైపుగా ప్రదక్షిణ చేయవలెను.

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి  కొన్ని వివరాలు


1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది '
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి .
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది .
అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు '

2. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో  సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .

3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి .
ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు .

4 . దర్శనానికి గిరిప్రదక్షిణ కి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు .

5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు .

6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా  అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది '
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు .

7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది .

8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది .

9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది '
మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో  బెంచీపై పడుకోండి " కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి .

10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని  దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు .
లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.

11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత
ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .
కచ్చితంగా దర్శనం చేసుకోండి .

12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది '
ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది .
రమణ మహర్షి వారు  అక్కడే తపస్సు చేసారు .

13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం .

14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం .

15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి .

16 ' అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది .
అద్భుతః

17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు .

18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం '
అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు .
ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . రూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అది స్వామి వారి మీద వేస్తారు .

19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది '
చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .
రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి .
ఇక్కడ
ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు .
విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు .
ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి

20 . ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు.
దర్శనం చేసుకొని తరించండి

ఓం అరుణాచలేశ్వరాయ నమః

సేకరణ :